April 17, 2026

పెద్దల అమావాస్య అంటే ఏమిటి.? విశేషాలు తెలుసుకుందాం

0
IMG-20250921-WA1002

సెప్టెంబర్ 21 హైదరాబాద్:మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు “మహాలయ అమావాస్య” అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది.

భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక “పితృపక్షం” అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్ర వచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలోను. మహాలయ అమావాస్యనాడు నిర్వహించడం. వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది.

పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకూ పదిహేను రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్తులు, మునులు, యతులు మృతిచెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్యనాడు. శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటినుండి మహాలయ పక్షంలోనూ, మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది.

కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెపుతోంది. ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు.

మహాలయ పక్షం “దినేదినే గయాతుల్యం” అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లి దండ్రులు, తాత ముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధవిధులు ప్రతిరోజూ నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడు తర్పణ శ్రాద్ధవిధులు నిర్వహించాలి. లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి.

మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధవిధులు నిర్వహించడం వల్ల త్రివేణీ సంగమలోను. గయలోను శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది.

┈┉┅━❀꧁పిత్రుదేవా꧂❀━┅┉┈
ఆధ్యాత్మిక అన్వేషకులు
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed