నిశీధిలో రక్షణ కవచం: అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
.కామారెడ్డి మార్చి 13: ఆపరేషన్ కవచ్: దొంగతనాల నియంత్రణే లక్ష్యం – పాత నేరస్తుల కదలికలపై పోలీసుల డేగ కన్ను.
• నేరగాళ్ల గుండెల్లో వణుకు: ‘పాప్లిన్’ డివైస్తో అనుమానితుల జల్లెడ – అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.
• ప్రజల కంటి నిండ నిద్ర కోసం పోలీసుల పహారా: సిబ్బందితో కలిసి టీ తాగుతూ ఉత్సాహపరిచిన జిల్లా ఎస్పీ.
• డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు: జిల్లా వ్యాప్తంగా 14 కేసులు నమోదు.
• నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసులకు ఎస్పీ కితాబు: సిబ్బందితో ఆత్మీయ పలకరింపు.
జిల్లా ఎస్పి శ్రీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ గారు
ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంలా, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా కామారెడ్డి జిల్లా పోలీస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరంతర నిఘా నేత్రం ‘ఆపరేషన్ కవచ్’. నగరం నిద్రపోతున్నా, రహదారులు నిశ్శబ్దంగా ఉన్నా.. ప్రతి మలుపులోనూ పోలీసుల పహారా ఉంటూ, అటు దొంగతనాల నియంత్రణకు, ఇటు రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం ఒక పటిష్టమైన ఆయుధంగా మారింది. ‘మనం మేల్కొని ఉంటేనే జిల్లా ప్రశాంతంగా నిద్రపోతుంది’ అనే నినాదాన్ని గుండెల్లో నింపుకుని, చీకటి ముసిరిన వేళ ప్రజల కంటి నిండా నిద్ర కోసం తమ కంటి రెప్ప వాల్చకుండా కాపలా కాసే కర్తవ్యంలో భాగంగా.. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు స్వయంగా అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీలను ఆకస్మికంగా పర్యవేక్షిస్తూ, నిశీధిలో కూడా ప్రజలలకు భరోసాగా నిలిచారు.”
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. దొంగతనాలు జరగకుండా అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ తనిఖీల్లో, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను “పాప్లిన్” (Papillon) డివైస్ ద్వారా ఈ రోజు 285 మందిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగినదని, అదే విధంగా నేర చరిత్ర ఉన్నవారిని జల్లెడ పడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, అప్రమత్తంగా ఉండాలని విధుల్లో ఉన్న సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు.
ఆపరేషన్ కవచ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మొత్తం 305 మందిని తనిఖీ చేయగా 14 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
అనంతరం సిరిసిల్ల రోడ్ చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షిస్తూ, అక్కడే విధుల్లో ఉన్న సిబ్బందితో కలిసి ఎస్పీ గారు టీ, స్నాక్స్ తీసుకుంటూ వారిని ఉత్సాహపరిచారు. నిశీధిలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది సేవలను ప్రత్యేకంగా అభినందిస్తూ, అలసటకు లోనవకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. చివరగా, ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. పోలీసులు మీ ప్రాణాల కోసం, ఆస్తుల రక్షణ కోసం 24/7 పహారా కాస్తున్నారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ శ్రీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ గారు, కామారెడ్డి ఎస్హెచ్ఓ నరహరి గారు, మాచారెడ్డి ఎస్హెచ్ఓ అనిల్, సదాశివనగర్ ఎస్హెచ్ఓ పుష్ప రాజు, ఎల్లారెడ్డి ఎస్హెచ్ఓ మహేష్, నసరూళ్ళబాద్ ఎస్హెచ్ఓ రాఘవేంద్ర, బాన్స్ వాడ యస్ఐ రాములు గారు మరియు ఇతర పోలీస్ సిబ్బంది రాత్రి విధుల్లో పాల్గొన్నారు.