400 ఏళ్ల చరిత్రకు నిదర్శనం – మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఛత్రపతి శివాజీ విడిది చేసినట్లు చరిత్ర చెబుతోంది
ఫిబ్రవరి 14 మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కొలువై ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ శివాలయం అయిన శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక,చారిత్రక ప్రాధాన్యత కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.సుమారు 400 సంవత్సరాల క్రితం గోల్కొండ నవాబు తానీషా ఆస్థాన మంత్రులు అయిన అక్కన్న మరియు మాదన్న ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.కోనేరు (శివగంగ) మధ్యలో వెలసిన ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది.భక్తులు కోనేరును దాటి స్వామివారి దర్శనం చేసుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఇక్కడ పరమశివుడు రాజరాజేశ్వరుడిగా,అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తుల పూజలందుకుంటున్నారు.పూర్వంలో మాంకాల్ మహేశ్వరం పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో మహా వీరుడు ఛత్రపతి శివాజీ కూడా విడిది చేసినట్లు చరిత్ర చెబుతోంది.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి.హైదరాబాద్ నగరానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం గ్రామంలో ఉన్న ఈ క్షేత్రాన్ని స్థానికులు “దక్షిణ కాశీ”గా భావిస్తూ అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తున్నారు.