స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయి:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Oplus_0
స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని, అలాంటి కోవలో నవ తెలంగాణ ఒకటని ఈ సందర్భంగా అభినందించారు. “కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పత్రికలు ప్రజల పక్షాన నిలబడి చైతన్యం చేయడంలో విశేష కృషి చేశాయి. అందరికీ ఆదర్శంగా నిలబడ్డాయి. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంతో పాటు బాల్య వివాహాలు, కులాల మధ్య అంతరాలు, జోగినీ వ్యవస్థ.. వంటి సమాజంలోని అనేక రుగ్మతలపై ప్రజలను చైతన్యం చేశాయి.చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించడంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నడిచే పత్రికల పాత్ర మరువలేనిది. ఇప్పుడు పాత్రికేయ రంగంలో కొన్ని వింత పోకడలు వచ్చాయి. తమ సంపాదనను కాపాడుకోవడానికి, వారిని ప్రశ్నిస్తున్న వారి పట్ల అసహ్యకర భాషను ఉపయోగించి ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సంస్థలు రావడం వల్ల జర్నలిస్టు అనే పదానికి అర్థం వెతుక్కోవలసిన దుస్థితి తలెత్తింది.జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారిపట్ల సమాజం నిశితంగా గమనించాలి. అలాంటి వారు వేరన్న విషయాన్ని అసలు సిసలైన జర్నలిస్టులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడలపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టు కూడా అదే దారిలో వేగంగా పరుగెత్తుతున్నారు.నిజమైన జర్నలిస్టులకు, ఆ ముసుగులో వస్తున్న వారికి మధ్య ఒక లక్ష్మణ రేఖను గీయాల్సిన అవసరం ఉంది. ఆ పని జరక్కపోతే పత్రికలకే కాదు, దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుంది.