విబేధాలు వీడి కలిసి ముందుకు సాగాలి, నాయకుల మధ్య సమన్వయ లోపం వద్దు: కిచెన్న గారి లక్ష్మారెడ్డి (KLR)
జనవరి 21 మహేశ్వరం:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఉచిత సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం, రైతు రుణాల మాఫీ, సబ్సిడీలు అనేకం అందాయని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్యాలయంలో కందుకూరు మండల నాయకులు, సర్పంచులు, కో- ఆర్డినేటర్స్ తో ప్రత్యేకంగా KLR సమావేశం అయ్యారు. సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ… కందుకూరు మండలంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందని సర్వే నివేదికలు చెబుతున్నాయని చెప్పారు. MPTC/ ZPTC అభ్యర్థుల ఎంపికలోనూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మరోసారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.సీనియర్ నాయకులు, సర్పంచులు, కొత్తగా పార్టీలో చేరిన నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండొద్దని కేఎల్ఆర్ సూచించారు. కలిసికట్టుగా పని చేస్తే 16 MPTC స్థానాలు, 1 జెడ్పీటీసీల్లో విజయం నల్లేరు మీద నడకేనని కిచ్చెన్నగారు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా జనాలను మభ్యపెట్టి, మాయ మాటలతో ఓట్లు కొల్లగొడుతున్నారని… మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని యువకులకు సూచించారు. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు పేద, మధ్య తరగతికి అందాయని కిచ్చెన్న గుర్తు చేశారు. విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.