పేదలే దేవుళ్లుగా సంక్షేమ పధకాలు అమలుఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
సెప్టెంబర్ 4: మాట ఇస్తే మడమ తిప్పనిది ఇందిరమ్మ ప్రభుత్వమని, రాష్ట్రంలో పేదవారి ఆత్మగౌరవం, భరోసా, భద్రతే లక్ష్యంగా, సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు.
బుభవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి గారు, పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారు, పాయం వెంకటేశ్వర్లు గారు, కోరం కనకయ్య గారు, రాందాస్ నాయక్ గారు, కూనంనేని సాంబశివరావు గారు, మట్టా రాగమయి దయానంద్ గారు, జిల్లా కలెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారులను గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నాన్నారు.
నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలను చీడపురుగుల్లా చూసి, కమిషన్లు వస్తాయనుకుంటేనే పని చేసిందని విమర్శించారు. కానీ నేడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని పేదోడి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవారిని దేవుడితో సమానంగా, వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు .
గత పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన అనాటి దొర గారు పేదలకు ఇండ్లు కట్టించాలన్న సోయి కూడా లేదన్నారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన ప్రభుత్వం మొదటి సంవత్సరమే 22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున అందించామన్నారు. 13 వేల చెంచులు, ఉప కులాల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇండ్లు అత్యధికంగా ఇవ్వాలన్నసిఎం రేవంత్రెడ్డి గారి సూచనలతో అదనంగా 1000 ఇండ్లతో పాటు ఐటిడిఎ పరిధిలో ఉన్నందును మరో 2500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి బటన్ నొక్కుతూ పూర్తయిన మేరకు ప్రతి ఇంటికి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 23లక్షల ఇండ్లు నిర్మించగా ఇప్పుడు మళ్లీ అదేవిధంగా పేదలకు ఇండ్లు అందిస్తున్నామని చెప్పారు, గత ఏడాది ఇదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారే ఈరోజు గృహప్రవేశాలకు రావడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. ఇదే ఒరవడిని రానున్న మూడేళ్లలో కొనసాగిస్తామని, రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని మంత్రి గారు తెలిపారు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని రోడ్లు వేస్తాం, ఇండ్లు కట్టిస్తామని చెప్పి దగా చేశారని విమర్సించారు. అదే గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 119 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. అంతే కాదు కెసిఆర్ గారి సొంత గ్రామమైన చింతమడకలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తప్పకుండా సంక్షేమం, అభివృద్ధిని అందిస్తూ ముందుకు పోతుందని మంత్రి గారు తెలిపారు.