మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
జనవరి 12 హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొరకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఫోటో ఓటరు తుది జాబితా ప్రకటించడం జరిగిందని, ఈ నెల 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి పరిశీలన, పరిష్కారం పిమ్మట ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ ప్రచురణ కొరకు ప్రింటింగ్ ప్రెస్ లను గుర్తించడం వంటి పనులు పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ జారీ లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫి రెన్స్ అనంతరం అధికారులతో
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అన్నారు.తుది ఓటరు జాబితా ప్రకటన, ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రకటించి, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణ కొరకు నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్ లు, ఎన్నికల సామాగ్రి ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్,జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.