ప్రజాప్రభుత్వం ఏర్పాటులో రైతుల పాత్ర మరవలేనిది :మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జనవరి 26 మహబూబాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో రైతన్నల పాత్ర మరవలేనిదని, గత ప్రభుత్వ అరాచక పాలనను కరడుకట్టిన వీర సైనికుల్లా ఎండగడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రజాప్రభుత్వంలో రావడంలో కీలకపాత్ర పోషించారని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ గారి అధ్యక్షతన నిర్వహించిన రైతులకు 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు.
రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన ఒక రైతు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో పాటు సహచర మంత్రులమందరు కూడా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సంకల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. వారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తున్నానమని, అందులో భాగమే రైతన్నలకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు 50% సబ్సిడీతో ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
మొదటి విడతగా మహబూబాబాద్ జిల్లాకు సుమారు రూ 3 కోట్ల 16 లక్షలు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగిందని మంత్రి గారు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్లతో సబ్సిడీ ఇవ్వడానికి ఈ ప్రజా ప్రభుత్వం ఏమాత్రం వెనక అడుగువేయదన్నారు.
ముఖ్యంగా గత పదేళ్ల రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటికి స్వస్తి పలుకుతూ రైతును రాజు చేయడమే ధ్యేయంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో ఉన్న ధరణి బంగాళాఖాతంలో వేసి రైతులకు చుట్టంలా ఉండే భూ భారతి అనే గొప్ప చట్టాన్ని తెచ్చామని పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయలు అదనంగా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల్లోనే రూ. 2లక్షల రుణమాఫీ చేశామని, రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల రూపాయల చొప్పున అందిస్తున్నామన్నారు.
ఈ ప్రభుత్వానికి ఎవరిపైనా వ్యక్తిగత భేషజాలు లేవని, కక్ష సాధింపు లేదన్నారు. ఉన్నదల్లా ఒక్కటే పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందాలి. రాష్ట్ర సుభిక్షంగా, ప్రజలు చల్లగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నాం మని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు.
ఏప్రిల్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని, అర్హులైన పేదలందరికీ తప్పకుండా ఇళ్ల మంజూరు చేస్థామన్నారు. ఇళ్ల స్థలాలు లేని పట్టణ పేదలకు ఎక్కడైతే ఇల్లు కట్టడానికి యోగ్యమైన ప్రభుత్వ భూమి ఉందో తప్పకుండా నిరుపేదలను గుర్తించి వారికి అందించాలని అధికారులను మంత్రి పొంగులేటి గారు ఆదేశించారు.
పదేండ్లపాలించిన పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలతో మారువేషంలో వస్తున్నారు. వారిని తప్పకుండా నిలదీయాలని మంత్రి గారు అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోరారు.